Responsive image

Press Information Bureau

Government of India

Prime Minister's Office

గుజరాత్ లోని కేవ‌డియా లో “'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని దేశ ప్రజల కు అంకితం చేసిన కార్యక్రమం లో ప్రధాన మంత్రి ఉపన్యాసం

Posted On :31, October 2018 18:29 IST

నేను సర్దార్ పటేల్ అని అంటాను, ఆ తరువాత మీరందరూ “అమర్ రహే, అమర్ రహే” అని అనండి..

“సర్దార్ పటేల్. అమర్ రహే, అమర్ రహే”

“సర్దార్ పటేల్. అమర్ రహే, అమర్ రహే”

“సర్దార్ పటేల్. అమర్ రహే, అమర్ రహే”

ఈ గడ్డ మీద నుండి నేను మరో నినాదాన్ని ఎలుగెత్తి చెబుతాను, అది యావత్తు దేశంలోను అనుక్షణం మారు మోగనుంది.  నేను ఏమని అంటానంటే ‘దేశ్ కీ ఏక్ తా’ (దేశం యొక్క ఐక్యత) మరి మీరందరూ “జిందాబాద్, జిందాబాద్” అని అనాలి.

“దేశ్ కీ ఏక్ తా.  జిందాబాద్, జిందాబాద్”

“దేశ్ కీ ఏక్ తా.  జిందాబాద్, జిందాబాద్”

“దేశ్ కీ ఏక్ తా.  జిందాబాద్, జిందాబాద్”

“దేశ్ కీ ఏక్ తా.  జిందాబాద్, జిందాబాద్”

వేదిక ను అలంకరించిన గుజరాత్ గవర్నర్ శ్రీ ఓం ప్రకాశ్ కోహ్లీ గారు, ప్రజాభిమానాన్ని చూరగొన్న ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ గారు, కర్నాటక గవర్నర్ శ్రీ వజూభాయ్ పటేల్ గారు, మధ్య ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, నా సహచరుడు, రాజ్య సభ సభ్యుడు శ్రీ అమిత్ భాయ్ శాహ్, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయ్, అసెంబ్లీ స్పీకర్ శ్రీ రాజేంద్ర గారు, ప్రపంచ దేశాలు, దేశం లోని భిన్న ప్రాంతాల నుండి ఇక్కడకు తరలివచ్చిన ప్రముఖులు, సోదరులు మరియు సోదరీమణులారా,

పవిత్రమైనటువంటి నర్మద నది తీరాన, వింధ్య, సాత్పురా పర్వత శ్రేణుల కు అత్యంత సన్నిహితం గా ఈ చారిత్రక సందర్భం లో దేశ వాసులు, ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులు, భారతదేశ ప్రేమికులందరికీ అభివాదం చేస్తున్నాను.  

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ను స్మరించుకుంటూ ఈ రోజు న దేశం యావత్తు జాతీయ ఏకత దినోత్సవాన్ని జరుపుకొంటోంది.  ఈ శుభ సందర్భం లో దేశం లోని ప్రతి ఒక్క ప్రాంతం లో మన యువత  దేశ ఐక్యత కోసం, సమగ్రత కోసం మారథన్ లో పాల్గొంటున్నారు. “ఐక్యత పరుగు”లో పాల్గొంటున్న వారందరినీ నేను ఈ సందర్భం గా అభినందిస్తున్నాను.  వేలాది సంవత్సరాలు గా మీరందరూ చూపుతున్న అంకిత భావం వల్లనే మన సంస్కృతి ఈ రోజు కూ మహోజ్వలం గా వెలుగుతోంది.  మిత్రులారా, ప్రతి ఒక్క దేశ చరిత్ర లో దేశ ప్రజలందరూ వారి ఆకాంక్షలు నెరవేరినట్టు గా భావించే సమయాలు కొన్ని ఉంటాయి.  అలాంటి రోజు దేశ చరిత్ర లో శాశ్వతంగా లిఖించిపోయి ఉంటుంది; దానిని చెరిపివేయటం సాధ్యం కాదు కూడా.  అదే రకం గా ఈ రోజు సైతం దేశ చరిత్ర లో కలకాలం గుర్తుండిపోయేది గా నిలచిపోతుంది.  దేశ చరిత్ర లో ఒక అద్భుతమైన ఘట్టం గా మిగిలిపోతుంది.  దేశానికి స్వాతంత్రం సిద్ధించి ఇన్ని దశాబ్దాలు అయినప్పటికీ దేశానికే గర్వకారణమైన, దేశానికి ప్రత్యేక గుర్తింపు ను సాధించిపెట్టిన, ప్రపంచ వ్యాప్తంగా గౌరవాన్ని ఆపాదించి పెట్టిన ఒక మహోన్నతుని కి అందవలసిన గౌరవం అందించలేకపోయాం.

ఈ రోజు న భారతదేశం ప్రస్తుత స్థితి లో ఒక మహోన్నత వ్యక్తిత్వం గల మనీషి ని తిరిగి గుర్తు చేసుకుంటున్నాం.  భూదిగంతరాలు కలిసేలా ఈ నేల పైన నిర్మించిన సర్దార్ సాహెబ్ ప్రతిరూపం గా నిలచే విగ్రహం దేశం లో కొత్త చరిత్ర ను రచించడమే కాదు, భవిష్యత్ తరాల కు స్ఫూర్తి గా నిలుస్తుంది.  ఈ రోజు న ఈ భారీ విగ్రహాన్ని దేశాని కి అంకింత చేసే భాగ్యం దక్కడం నేను చేసుకొన్న అదృష్టం.   గుజరాత్ ముఖ్యమంత్రి గా నేను ఉండగా ఈ ప్రాజెక్టు కు శ్రీకారాన్ని చుట్టిన సమయం లో ప్రధాన మంత్రి హోదా లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే భాగ్యం నాకు లభిస్తుందని కల లో అయినా నేను ఊహించలేదు.  అటువంటి భాగ్యం లభించేటట్టు ఆశీర్వదించిన మీ అందరికీ నా ధన్యవాదాలు.  నన్ను అభినందిస్తూ లేఖ రాసిన గుజరాత్ ప్రజలందరికీ నేను ఎంతో కృతజ్ఞుడి ని.  నా వరకు అది నాకు గౌరవ పూర్వకంగా అందించిన లేఖ కన్నా ఎంతో గొప్ప ది.  తల్లి తన బిడ్డ పైన చేయిని ఉంచినప్పుడు ఉద్భవించే శక్తి ఎన్నో రెట్లు గొప్ప ది.  అదే విధం గా ఈ లేఖ తల్లి ఆశీస్సులు లభించినంత అనుభూతి ని నాలో కలిగించింది.  లోహ అభియాన్ సందర్భం గా సేకరించిన ఒక ఇనుప ముక్క ను కూడా నేను అందుకున్నాను.  అహమదాబాద్ లో లోహ అభియాన్ సందర్భం గా ఎగురవేసిన జెండా ను కూడా నేను అందుకున్నాను.  మీ అందరికీ, ప్రత్యేకించి గుజరాత్ ప్రజలందరికీ, నేనెంతో కృతజ్ఞుడి ని.  ఈ వస్తువులన్నింటినీ నేను ఇక్కడే వదలి వెళ్తుతున్నాను.  వాటిని మీరంతా ఒక వస్తు ప్రదర్శన శాల లో భద్రపరిస్తే వాటి ప్రాధాన్యం ఏమిటో యావత్తుదేశానికి తెలుస్తుంది. 

నాకు పాత రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి; నేను పరిపూర్ణమైన హృదయం తో మాట్లాడుతున్న అనుభూతి కలుగుతోంది.  దేశం లోని రైతులందరి నుండి వారి నేల లోని మట్టి ని, పాత వ్యవసాయ పనిముట్లను, ఉపకరణాలను సేకరించిన రోజులు జ్ఞప్తి కి వస్తున్నాయి.  లక్షలాది వ్యవసాయ కుటుంబాలు దీనిని ఒక మహోద్యమం గా చేపట్టి ఈ విగ్రహ నిర్మాణానికి తమ వాటా ను అందించేందుకు ముందుకు వచ్చారు.  వారందరూ అందించిన కోట్లాది టన్నుల బరువు గల పరికరాలన్నింటితో విగ్రహానికి అవసరం అయిన భారీ పునాది నిర్మాణం జరిగింది. 

మిత్రులారా, 

ఈ ఆలోచన చేసినప్పుడు ఎన్నో అనుమానాలు, ఆలోచనలు నా మదిలో మెదిలాయి.  వాటిలో కొన్నింటి ని మీకు తెలియ చేయాలనుకుంటున్నాను.  ఈ ఆలోచన నా మనస్సు లో వచ్చినప్పుడు సర్దార్ సాహెబ్ విగ్రహం ఉన్న ప్రదేశం లో ఒక భారీ కొండ శిల ను తీసుకువచ్చి దానిపై విగ్రహాన్ని నిర్మించాలని భావించాను.  కాని అంత భారీ శిల లభించడం కష్టమే కాకుండా ఒకవేళ లభించినప్పటికీ దానిని తరలించగలిగినా, దాని నుంచి చెక్కే ఇంత భారీ విగ్రహం దానికి ఉండాల్సిన బలాన్ని కలిగి ఉండే ఆస్కారం లేదని తరువాత గ్రహించాను.  అప్పుడు నా మనస్సు మార్చుకున్నాను.  దాని నుండి ఉద్భవించిందే ఈ నాటి ఈ భారీ విగ్రహం.  దాని గురించే నేనెప్పుడూ ఆలోచిస్తూ ఉండే వాడి ని.  ఎందరి సలహాలు, సూచనలనో తీసుకున్నాను.  ఈ రోజు న ఈ కీలకమైన ప్రాజెక్టు సాకారం కావడానికి దోహదపడిన వారందరూ ఈ దేశం మీద విశ్వాసాన్ని, ఈ దేశం సామర్థ్యాన్ని నిలబెట్టారని చెప్పడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను.

సోదరులు మరియు సోదరీమణురాలా, 

ప్రపంచం లోనే అతి పొడవైన విగ్రహం ఇది.  మాతృ దేశాన్ని ముక్కలు చేసేందుకు పన్నిన కుట్రలన్నింటినీ భగ్నం చేసిన ఈ మహోన్నతుడి సాహసం, సామర్థ్యాలు, సంకల్పబలాలను గురించి, తాను నమ్మిన సంకల్పానికే జీవితం యావత్తు కట్టుబడిన దీక్షాదక్షుడి ని గురించి భవిష్యత్ తరాలన్నింటికీ గుర్తు చేయాలన్నదే నా ఆలోచన.   భారతదేశం నుండి యావత్తు ప్రపంచం ఆశిస్తున్నది ఇదే.  అటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కు నేను అభివాదం చేస్తున్నాను.

మిత్రులారా, 

భారతదేశం 550కి పైగా చిన్న చిన్న రాజ్యాలు గా విడిపోయి ఉన్న సమయం లో సర్దార్ సాహెబ్ తన సామర్థ్యాల ను వినియోగం లోకి తెచ్చారు.  ఆ నాడు భారతదేశ భవిష్యత్తు పై ప్రపంచం నిరాశాపూరితం గా ఉంది.  ఆ రోజుల్లో కూడా నిరాశావాదులు మనుగడ సాగించారు.   భిన్నత్వం కారణం గా భారతదేశం ముక్కలైపోతుందని ఆ వారు భావించారు.  అంత నిరాశావహమైన వాతావరణం లోనూ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ రూపం లో ఒక ఆశాకిరణాన్ని దర్శించిన వారు ఉన్నారు.  కౌటిల్యుని దౌత్యం, శివాజీ మహారాజ్ సాహసం కలబోసిన మూర్తిమత్వం సర్దార్ పటేల్.  1947 జూలై ఐదో తేదీ న ఈ చిన్న చిన్న రాజ్యాల రాజుల సమావేశం లో సర్దార్ జీ మాట్లాడుతూ  ఈ విధంగా ఎలుగెత్తి చాటారు. “మన అంతర్గత కలహాలు, వైరాలు విదేశీ దాడుల్లో మన వైఫల్యాలకు ప్రధాన కారణం.  ఈ రోజు న అదే పొరపాటు మరోసారి చేసి, ఎవరికో బానిసలు గా ఉండే పరిస్థితి మనం కల్పించుకోకూడదు” అని సర్దార్ జీ అన్నారు.

ఆ రోజు న సర్దార్ సాహెబ్ చెప్పిన ఆ మాటల కు నేటి కి కూడా ఎంతో విలువ ఉందని నేను భావిస్తున్నాను. 

ఆ రోజు న సర్దార్ సాహెబ్ చెప్పిన మాటలు విని, ఏకత యొక్క శక్తి ని గుర్తించిన చిన్న చిన్న రాజ్యాల అధినేతలందరూ వారి రాజ్యాల ను విలీనం చేశారు.  దాని ఫలితం గానే భారతదేశం ఉనికి లోకి వచ్చింది.  సర్దార్ సాహెబ్ పిలుపు తో ఆ నాటి రాజ్యాధినేతలంతా త్యాగాలు చేశారు.  వారు చేసిన త్యాగాలను మనం మరిచిపోకూడదు. భారతదేశం ఒక జాతి గా ఆవిర్భవించడానికి వారందరూ చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఒక వస్తు ప్రదర్శన శాల ను ఏర్పాటు చేయాలన్నది నా కల.  ఈ రోజు న ప్రజాస్వామికం గా ఎన్నికైన నాయకుడి ని లేదా ఒక చిన్న తహసీలుదారును అయినా వారి పదవీ కాలం పూర్తి కావడానికి ఏడాది ముందు పదవి నుండి వైదొలగాలని కోరితే పెద్ద కల్లోలమే చెలరేగుతుంది.  కానీ ఆ రాజులందరూ వారి తాత ముత్తాతలు తరతరాల నుండి సృష్టించి ఇచ్చిన సామ్రాజ్యాల ను తృణప్రాయం గా త్యజించి భారత ఏకత కై అందజేశారు.  దీని ని మనం ఏ నాటికీ మరిచిపోకుండా శాశ్వతం గా గుర్తు పెట్టుకోవాలి.

మిత్రులారా, 

ఏదైతే యావత్తు భారతదేశం బలహీనత గా ప్రపంచం భావించిందో అదే బలహీన తను శక్తి గా మార్చి సర్దార్ పటేల్ జాతి భవిష్యత్తు కు బాట ను పరచారు.  అదే బాట లో పయనిస్తూ భారతదేశం ఒకప్పుడు దేశ భవిష్యత్తు పైన అనుమానాలు వ్యక్తం చేసిన వారికే తన నియమని బంధనలు, షరతులు ఏమిటో నిర్దేశించ గలుగుతోంది.  ప్రపంచం లోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా, వ్యూహాత్మక శక్తి గా భారతదేశం ఎదుగుతోంది.  ఒక సాధారణ రైతు కుటుంబం లో జన్మించి ఒక అసాధారణమైన వ్యక్తిత్వం గల వాడు గా ఎదిగిన సర్దార్ పటేల్ గారి అసాధారణ సేవ ల వల్లనే ఇది సాధ్యం అయింది.  భారతదేశం అభివృద్ధి లో సర్దార్ పటేల్ పాత్ర కీలకమైంది.  ఎన్నో ఒత్తిడులు, అభిప్రాయ భేదాలు ఎదురైనప్పటికీ సర్దార్ సాహెబ్ పాలన యంత్రాంగం ఏ విధమైన పాలన ను అందించాలో చాటి చెప్పారు.  ఈ రోజు న మనందరి కచ్ఛ్ నుండి కోహిమా వరకు, కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడికైనా స్వేచ్ఛ గా ప్రయాణం చేగలుగుతున్నామంటే అది సర్దార్ సాహెబ్ తీర్మానం వల్ల, సంకల్పం వల్ల సాధ్యపడింది.  సర్దార్ సాహెబ్ ఆ రోజు న ఆ సంకల్పాన్ని చేసుకొని ఉండకపోతే పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఊహించుకుందాం.   ప్రజలు గిర్ లో ని సింహాన్ని చూడాలన్నా, హైదరాబాద్ లోని చార్ మినార్ ను సందర్శించాలన్నా, సోమనాథుని కి పూజలు చేసుకోవాలన్నా వీసా లను తీసుకోవలసి వచ్చేది.  సర్దార్ సంకల్ప బలమే తోడు గా లేకపోతే ఈ రోజున కశ్మీర్ నుండి కన్యాకుమారి కి నేరు గా ఒక రైలు ఉండేదే కాదు, ఉన్నా ఎన్నో పాలనాపరమైన అవరోధాలను ఎదుర్కోవలసి వచ్చేది. 

సోదరులు మరియు సోదరీమణులారా,  

1947 ఏప్రిల్ 21 వ తేదీ ని అఖిల భారత అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల ప్రొబేశనర్ లను ఉద్దేశించి మాట్లాడుతూ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఎంతో విలువైన విషయాన్ని చెప్పారు.  ఈ నాటి ఐఎఎస్ లు, ఐపిఎస్ లు, ఐఎఫ్ఎస్ లు కూడా దాన్ని గుర్తు పెట్టుకోవాలి.  అప్ప‌టివ‌ర‌కు ఇండియన్ సివిల్ సర్వీసు కు “ఇండియన్”, “సివిల్”, “సర్వీస్” అనే పదాలు చెలామణి లో లేవు.  ఆ పరిస్థితి ని మార్చాలని నాటి యువత కు సర్దార్ సాహెబ్ పిలుపు ఇచ్చారు.  పారదర్శకత్వం తో, నిజాయతీ తో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు గౌరవాన్ని పెంచాలని యువత ను కోరారు.  భారత పునర్నిర్మాణం కోసం దాన్ని ప్రతిష్ఠించాలని సూచించారు.  సర్దార్ సాహెబ్ అందించిన స్ఫూర్తి తోనే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు లు ఒక ఉక్కు కవచం లా తయారయింది.

సోదరులు మరియు సోదరీమణులారా, 

దేశం అత్యంత సంక్లిష్టమైన స్థితి లో ఉన్నప్పుడు సర్దార్ పటేల్ కు హోం మంత్రి పదవి ఇచ్చారు.  దేశ వ్యవస్థలన్నింటినీ పునర్నిర్మించే బాధ్యత తో పాటు దేశంలో శాంతి భద్రత ల వ్యవస్థ నిర్వహణ బాధ్యతలు కూడా ఆయన కు అప్పగించారు.  ఆ క్లిష్టమైన స్థితి నుండి ఆయన దేశాన్ని వెలుపల కు తీసుకు వచ్చి ఆధునిక పోలీసు వ్యవస్థ కు ఒక పునాది ని వేశారు.

మిత్రులారా, 

సర్దార్ సాహెబ్ దేశం లోని మారుమూల ప్రాంతాల ప్రజల ను ప్రజాస్వామ్యం తో అనుసంధానం చేసేందుకు ప్రతి ఒక్క క్షణం శ్రమించారు.  భారత రాజకీయాల కు మహిళలు తమ వంతు వాటా అందించేలా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చర్య లు తీసుకున్నారు.  గ్రామ పంచాయతీ లు, నగరపాలక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా మహిళల కు అర్హత ను కల్పించని పరిస్థితి కి వ్యతిరేకం గా ఆయన గొంతెత్తి నినదించారు.  ఆయన చొరవ తోనే స్వాతంత్ర్యం సిద్ధించడాని కి కొన్ని దశాబ్దాల ముందే ఈ వివక్ష తొలగిపోయింది.  సర్దార్ సాహెబ్ కృషి వల్లనే పౌరులకు ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్యం లో భాగం అయ్యాయి.  

మిత్రులారా, 

సర్దార్ పటేల్ ప్రేమ, ప్రతిభ, ముందుచూపు, ఆధ్యాత్మికత లకు పవిత్రమైన ప్రతీక ఈ విగ్రహం.  ఈ విగ్రహం ఆయన బలానికి, అంకిత భావాని కి నివాళి మాత్రమే కాదు, న్యూ ఇండియా లో నెలకొన్న ఆత్మవిశ్వాసాని కి కూడా సంకేతం.  భారతదేశ అస్తిత్వం మీద ఎన్నో అనుమానాలను వ్యక్తం చేసిన వారందరికీ భారతదేశం శాశ్వతమైంది, అంతం లేనిది, హద్దులు లేనిది అని ఇది నిరూపిస్తుంది. 

విగ్రహం నిర్మాణం కోసం తమ పొలాల్లోని మట్టి, పాతబడిన తమ ఇనుప పనిముట్లను అందించిన వ్యవసాయదారులందరి ఆత్మవిశ్వాసాని కి, ఎన్ని అవరోధాలు ఎదురైనా దీటు గా ఎదుర్కొని జాతి కి ఆహార ధాన్యాలను అందిస్తామన్న వారి కట్టుబాటు కు చిహ్నం.  స్వాతంత్ర్య ఉద్యమ కాలం నుండి అభివృద్ధి పథం లో నడచే వరకు తమ వంతు సేవలను అందించిన ఆదివాసీ సోదరులు మరియు సోదరీమణులందరి గౌరవ చిహ్నం.  అంతే కాదు ఈ సమున్నత శిఖరాలన్నీ భారత యువత కు వారు కనే ఉన్నతమైన కలలు, ఆశలు సాకారం అవుతాయని నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుంది.  వారి ఆశలు, ఆశయాలు సాకారం కావడానికి ఒకటే మంత్రం -
“ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్”,

“ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్”,
 
“ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్”.

మిత్రులారా, 

మన ఇంజినీయరింగ్, సాంకేతిక పోటీ సామర్థ్యానికి కూడా ఈ విగ్రహం ఒక ప్రతీక. గత మూడున్నర సంవత్సరాలు గా సగటు న 2500 మంది కార్మికులు ఉద్యమ స్ఫూర్తి తో ఈ విగ్రహ నిర్మాణం కోసం శ్రమించారు.  వారి లో కొందరి ని త్వరలో సత్కరించడం కూడా జరుగుతుంది.  ఈ అద్భుతమైన విగ్రహాని కి రూపకర్త గా వ్యవహరించిన ప్రధాన శిల్పి 90 ఏళ్ల వయస్సు పై బడిన శ్రీరాం సుతార్.  వారందరి ఉద్యమ స్ఫూర్తి, జాతీయ ఏకత కు వారి కట్టుబాటు, శ్రమ ల కారణంగా ఇంత స్వల్ప సమయం లో ఇంత భారీ విగ్రహ నిర్మాణం పూర్తయింది.  సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణాని కి శంకుస్థాపన జరిగిన ఎన్నో సంవత్సరాల తరువాత గాని ఆ ఆనకట్ట ను ప్రారంభించుకోలేక పోయాం.  కానీ ఈ ప్రాజెక్టు మీ అందరి కళ్ల ముందే రూపు దిద్దుకొని సాకారం అయింది.  ఈ విగ్రహ నిర్మాణం లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరినీ, ప్రతి కార్మికుడి ని, ప్రతి వాస్తుశిల్పి ని, ప్రతి కళాకారుడి ని, ప్రతి ఇంజినీయర్ ను ఈ సందర్భం లో పేరు పేరునా నేను అభినందిస్తున్నాను.  సర్దార్ విగ్రహ నిర్మాణం లో భాగస్వాములైన వారందరి పేర్లు చరిత్ర లో చిరస్థాయి గా నిలుస్తాయి. 

మిత్రులారా, 

ఈ రోజు న ఈ ప్రయాణం ఒక కొత్త మైలురాయి ని చేరుకొంది.  ఈ ప్రయాణం సరిగ్గా ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే రోజు న ప్రారంభం అయింది.  2010వ సంవత్సరం అక్టోబరు 31వ తేదీ న అహమదాబాద్ వాసుల ముందు ఈ ఆలోచన ను నేను ఆవిష్కరించాను.  కోట్లాది మంది భారతీయుల వలెనే ఆ రోజు న నా మది లో ఉన్న ఒకే ఒక్క ఆలోచన భారతదేశాన్ని ఒక్కటి గా నిలిపేందుకు అవిరళమైన కృషి ని చేసిన మహోన్నతుని కి అందించవలసిన గౌరవాన్ని అందించాలన్నదే.  అంతే కాదు, సర్దార్ పటేల్ గారి జీవిత పర్యంతం ఎవరి సంక్షేమం కోసం పాటు పడ్డారో అటువంటి రైతులు, కార్మికుల స్వేద బిందువులే దీని నిర్మాణం లో ఉండాలని కూడా నేను ఆకాంక్షించాను.

మిత్రులారా, 

ఖేదా నుండి బార్డోలి వరకు సర్దార్ పటేల్ సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించడం లేదా రైతాంగం దోపిడి కి వ్యతిరేకం గా నినదించడమే కాదు వారి సమస్యల కు చక్కని పరిష్కారాలను కూడా చూపించారు.  సర్దార్ సాహెబ్ ముందు చూపు వల్లనే సహకారోద్యమం ముందుకు సాగి ప్రతి ఒక్క గ్రామం లో వేళ్లూనుకుని ఈ రోజు న ఆర్థిక వ్యవస్థ కు బలమైన పునాది ని అందించింది. 

మిత్రులారా, 

ఈ విగ్రహం సర్దార్ పటేల్ గారి పట్ల కోట్లాది మంది భారతీయులకు గౌరవ ప్రదర్శన చిహ్నమే కాదు, దేశ ఆర్థిక రంగం లో, ఉపాధి కల్పన లో కూడా కీలక పాత్ర కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది ఆదివాసీ సోదరుుల మరియు సోదరీమణులకు ఉపాధి ని కల్పిస్తుంది.  వింధ్య, సాత్పురా పర్వత శ్రేణులు బహుమతి గా అందించిన ఈ ప్రకృతి ఆధునిక మార్గం లో కూడా మీకు లాభాన్ని చేకూరుస్తుంది. ఇంతవరకు పద్యాలలోనే ప్రపంచం విన్న గిరిజన అటవీ, సాంస్కృతిక వైభవాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.  సర్దార్ పటేల్ విగ్రహం సందర్శన కు వచ్చే పర్యాటకులందరూ ఇప్పుడు సర్దార్ సరోవర్ ఆనకట్ట ను, వింధ్య, సాత్పురా పర్వత శ్రేణుల ను కూడా తిలకించ గలుగుతారు.  ఈ విగ్రహం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ పర్యాటకుల కు ఆకర్షణీయ కేంద్రాలు గా తీర్చి దిద్దినందుకు గుజరాత్ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను.  ఇక్కడ అభివృద్ధి చేసిన పూల లోయ ఈ విగ్రహం అందాన్ని ఇనుమడింపచేస్తుంది.  అలాగే ఇక్కడ త్వరలో ఒక ఏక్ తా వృక్షసంవర్ధిని కూడా రానుంది.  ఈ ప్రాంతం సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులందరూ అక్కడ నుండి ఒక మొక్క ను తీసుకు పోయి ఏకత చిహ్నం గా వారి ఇళ్ల లో వేసుకోవచ్చును.  తద్వారా ఏకత వృక్షం శాఖలను మొలిపించి దేశ ఐకమత్య ప్రాధాన్యాన్ని ప్రతి క్షణం గుర్తు చేసుకోగలుగుతారు.  పర్యాటకం కూడా ఈ ప్రాంత ప్రజల జీవితాలలో మార్పు ను తీసుకురానుంది. 

మిత్రులారా, 

ఈ ప్రాంతాని కి చెందిన సాంప్రదాయక విజ్ఞానం ఎంతో సుసంపన్నమైనటువంటిది.  ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (ఏకత విగ్రహం) వల్ల పర్యాటకం అభివృద్ధి చెందితే ఆ సాంప్రదాయక విజ్ఞానం కూడా దశ దిశ లా వ్యాపించి ఈ ప్రదేశాని కి చిరస్థాయి గా నిలచే గుర్తింపు ను తీసుకు వస్తుంది.  ఈ ప్రాంతం తో నాకు సుదీర్ఘ సాన్నిహిత్యం ఉన్నందు వల్ల ఎన్నో విషయాలు నాకు ఎరుకే.  ఉనా మండా, తెహ్లా మండా, తోకలా మండా తదితర రక రకాల బియ్యం తో వండిన వంటకాల రుచి ని కూడా పర్యాటకులు ఆస్వాదించగలుగుతారు.  బహుశ ఈ సభ లో కూర్చున్న వారు కూడా ఆ వంటకాలను రుచి చూడాలనుకుంటూ ఉండవచ్చు.  అంతే కాదు ఇక్కడ ఖతీ భింది పేరు గల ఒక ఆయుర్వేద మూలిక విస్తృతంగా లభిస్తుందని ఆయుర్వేద విజ్ఞానం తో అనుబంధం ఉన్న వారందరికీ తెలుసు.  దీని కి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ప్రాంత సందర్శకులు దాని గురించిన అవగాహన ను కూడా పొందగలుగుతారు. అంతే కాదు ఇక్కడ వ్యవసాయాన్ని మెరుగు పరచేందుకు, ఆదివాసీల జీవితాలకు మెరుగులు దిద్దేందుకు గల అవకాశాలపై అధ్యయనాని కి ఇది ఒక కేంద్రం గా మారుతుందని నేను నమ్ముతున్నాను.

మిత్రులారా, 

జాతి కి ఎన్నో సేవలందించిన మహోన్నత నాయకుల ను గుర్తు చేస్తూ గత నాలుగు సంవత్సరాల కాలం లో ప్రభుత్వం భారీ ప్రచారోద్యమాన్ని నిర్వహించింది.  గుజరాత్ ముఖ్యమంత్రి గా పని నేను చేసిన సమయంలో అటువంటి విషయాల పై నాకు ఎంతో ఆసక్తి ఉండేది.  మన ప్రాచీన సంస్కృతి ని, విలువల ను మనతో పాటు గా ముందుకు నడిపించాలి.  ఆకాశాన్నంటే సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి భారీ విగ్రహం ఒక్కటే కాదు, ఒక ఆధునిక సంగ్రహాలయాన్ని కూడా ఆయన స్మారకార్థం ఢిల్లీ లో ఏర్పాటు చేశాం.  గాంధీనగర్ లో మహాత్మా మందిర్, దండి కుటీర్, బాబాసాహెబ్ భీం రావు ఆంబేడ్ కర్ పంచతీర్థ, హరియానా లో వ్యవసాయ నాయకుడు సర్ ఛోటూ రామ్ పొడవైన విగ్రహం, మాండవి లో స్వతంత్ర యోధుల స్మారక చిహ్నం, గుజరాత్ పుత్రుడైన శ్యాంజీ కృష్ణ వర్మ, ఆదివాసీల నాయకుడు వీర్ నాయక్ గోవింద్ గురు ల స్మారకాలను కూడా ఏర్పాటు చేశాం.  

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియమ్, ఛత్రపతి శివాజీ మహరాజ్ భారీ విగ్రహం, స్వాతంత్రోద్యమం లో పాల్గొన్న ఆదివాసీ నాయకుల స్మారకార్ధం ఒక చిహ్నం, రాజ్యాంగాని కి బాబా సాహెబ్ అందించిన సేవల కు గుర్తింపు గా నవంబర్ 26వ తేదీ న రాజ్యాంగ దినోత్సవం నిర్వహణ, నేతాజీ పేరిట జాతీయ పురస్కారాన్ని నెలకొల్పడం వంటి ఆలోచన లు కూడా ఎన్నో ఉన్నాయి.  కానీ కొందరు వీటన్నింటినీ రాజకీయ దుర్భిణి లో నుండి చూడటం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

సర్దార్ పటేల్ సహా జాతీయ నాయకులను కొనియాడుతున్నందుకు మా పై ఎందుకు విమర్శలు వస్తున్నాయో నాకు తెలియదు.  మేం ఏదో చేయరాని నేరాన్ని చేస్తున్నామనే భావన కలిగేలా వారు ప్రచారం సాగిస్తున్నారు.  మిమ్మల్నందర్నీ ఒకటే అడుగుతున్నాను, దేశ ప్రజల కు మహోన్నతమైనటువంటి సేవలను అందించిన మహానాయకుల ను గుర్తు చేసుకోవడం నేరమా ?

మిత్రులారా, దేశం లోని ప్రతి ఒక్క పౌరుడు సర్దార్ పటేల్ గారి కఠోర శ్రమ ను, సామర్థ్యాలను, ముందుచూపు ను ముందుకు నడిపేలా చూడాలన్నదే మా ప్రయత్నం.

సోదరులు మరియు సోదరీమణులారా, 

స్వాతంత్ర్యం సిద్ధించడానికి మూడు, నాలుగు నెలల ముందు విఠల్ భాయ్ పటేల్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న సందర్భం గా  స్వతంత్ర భారతం లో గ్రామాలు ఎలా ఉండాలన్న అంశం పై సర్దార్ పటేల్ గారు తన కలలను అందరితో పంచుకున్నారు.  కళాశాల నిర్మాణ సమయం లో ఆయన ఇలా చెప్పారు..  గ్రామాల లో ఇళ్ల ను మనం ఒక ప్రణాళిక అంటూ లేకుండా నిర్మిస్తున్నాం.  రోడ్లను కూడా ఎటువంటి ఆలోచన చేయకుండానే నిర్మిస్తున్నాం.  ఫలితం గా ఇళ్ల ముందు చెత్త పేరుకుపోతోంది అన్నారు.  ఆ రోజుల్లోనే ఆయన బహిరంగ మలమూత్రాదుల విసర్జన, చెత్త చెదారం లేని గ్రామాలు రావాలని ఆకాంక్షించారు.  సర్దార్ సాహెబ్ కల ను సాకారం చేసే దిశ గా ఈ రోజు న దేశం పురోగమిస్తోందని చెప్పేందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ రోజు న గ్రామాల పారిశుధ్యం 95 శాతాని కి చేరింది. 

సోదరులు మరియు సోదరీమణులారా, 

దేశాన్ని సాధికారం, అప్రమత్తం, సమ్మిళితం చేయాలని సర్దార్ పటేల్ గారు ఎల్లప్పుడూ ఆకాంక్షించే వారు. ఆ కలల ను సాకారం చేసే దిశ గా మా ప్రయత్నాలన్నీ సాగుతున్నాయి.  దేశం లో ఇళ్లు లేని వారందరి కి పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చే దిశ గా మేం ఓ భగీరథ పథకాన్ని చేపట్టాం.  స్వాతంత్ర్యం సిద్ధించిన దశాబ్దాల తరువాత కూడా వెలుగుల కు నోచుకోని 18 వేల గ్రామాలకు విద్యుత్తు ను సమకూర్చాం. సౌభాగ్య యోజన లో భాగం గా ప్రతి ఇంటికి విద్యుత్తు కనెక్షన్ లను ఇచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం.  దేశం లోని ప్రతి ఒక్క గ్రామాని కి రోడ్లు, ఆప్టిక్ ఫైబర్ నెట్ వర్క్, డిజిటల్ కనెక్టివిటీ లను కల్పించే కృషి త్వరిత గతి న సాగుతోంది.  ఈ కార్యక్రమాల కు సమాంతరం గా ప్రతి ఒక్క కుటుంబాని కి గ్యాస్ కనెక్షన్ ను ఇవ్వడం, మరుగుదొడ్ల నిర్మాణం ముందుకు సాగుతున్నాయి. 

ప్రపంచం లోకెల్లా అతి భారీ ఆరోగ్య పథకాన్ని మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  దాని ని గురించి నేను ప్రజల కు చెప్పినప్పుడు యావత్తు ప్రపంచం నివ్వెరపోయింది. ‘ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన’ లేదా ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ పేరిట ప్రారంభించిన ఆ కార్యక్రమం అమెరికా, మెక్సికో, కెనడా ల ఉమ్మడి జనాభా కన్నా అధిక జనాభా ఆరోగ్య అవసరాల ను తీర్చుతుంది.  కొందరు దాన్న మోదీ కేర్ గా వ్యవహరించారు.  ఆరోగ్యవంతమైన భారతదేశం నిర్మాణాని కి ఈ స్కీము ఎంతగానో ఉపయోగపడుతుంది.  సమ్మిళితమైన, సాధికారికమైనటువంటి భారతదేశం ఆవిష్కారం దిశ గా “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్”యే మా మంత్రం గా ఉంది.

సోదరులు మరియు సోదరీమణులారా, 

చిన్నచిన్న రాజ్యాలన్నింటిని ఏకం చేసి దేశం లో రాజకీయ ఐక్యత కు సర్దార్ సాహెబ్ కృషి చేశారు.  ఆ విధం గానే మా ప్రభుత్వం జిఎస్ టి ని ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక ఏకీకరణ ను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేసింది.  ‘ఒక దేశం, ఒకే పన్ను’ కల ను అది సాకారం చేసింది.  సర్దార్ సాహెబ్ దీక్ష ను ముందుకు నడిపేందుకు మేం అవిరళం శ్రమిస్తున్నాం.  వ్యవసాయ మండీలన్నింటినీ అనుసంధానం చేసే ఇ-నామ్, ఒక జాతి-ఒక గ్రిడ్, భారత్ మాల, సేతు భారతం, భారత్ నెట్ పథకాలన్నీ ఆ ది శగా ప్రారంభించినవే.  ఈ ప్రాజెక్టులన్నింటితో “ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్” అనే సర్దార్ సాహెబ్ కల ను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.  

మిత్రులారా, 

దేశ భవిష్యత్తు ను గురించి ఎంతో ఆసక్తి గల యువత బలం ఈ రోజు న మనకు ఉంది.  అభివృద్ధి కి మార్గం ఇదొక్కటే, దేశవాసులందరూ ఈ మార్గం లోనే ముందుకు సాగాలి.  సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారు దేశ ఐక్యత ను, సమగ్రత ను, సార్వభౌమత్వాన్ని కాపాడవలసిన బాధ్యత ను మనందరిపై పెట్టి వెళ్లారు.  దేశాన్ని విభజించే ప్రయత్నాలన్నింటినీ బలంగా తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.  మనందరం సదా అప్రమత్తులమై సమాజ ఐకమత్యాన్ని కాపాడాలి. సర్దార్ సాహెబ్ బోధించిన విలువల నుండి భవిష్యత్ తరాలను దూరం చేసే ప్రయత్నాలేవైనా తిప్పి కొట్టడం లో ఎటువంటి అవకాశాన్ని వదులుకునేది లేదని మనంతా ప్రతిజ్ఞ చేయాలి. 

మిత్రులారా, 

ప్రతి ఒక్క భారతీయుడు కులం, వర్గం వంటివన్నీ మరచిపోయి భారతీయులం అనేది ఒక్కటే గుర్తుంచుకోవాలి, దేశం మీద హక్కుల తో పాటు వారిపై ఎన్నో విధులు కూడా ఉన్నాయి అని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారు చెప్తూ ఉండే వారు. ఈ భారీ విగ్రహం వలెనే సర్దార్ సాహెబ్ అద్భుతమైన ఆలోచనలన్నీ కూడా మన లో స్ఫూర్తి ని నింపుతూ ఉండాలి.  ఈ ఐక్యతా విగ్రహం యావత్తు ప్రపంచాని కి ఒక అద్భుతం గా నిలచింది.  అందుకే అందరి దృష్టి ఇప్పుడు ఈ పవిత్ర నర్మదా మాత తీరం పైనే కేంద్రీకృతమై ఉంది.  ఈ కల సాకారం చేయడం కోసం నిరంతరం శ్రమించిన, ఈ ప్రాజెక్టు తో అనుబంధం కలిగి ఉన్న ప్రతి ఒక్కరి ని నేను అభినందిస్తున్నాను.  నర్మద, తపతి చరియల లో నివసిస్తున్న ప్రతి ఒక్క సోదరి, ప్రతి ఒక్క సోదరుల భవిష్యత్తు ఉజ్వలం గా ఉండాలని నేను అభినందనలు తెలియ చేస్తున్నాను. 

ఈ కార్యక్రమం తో యావత్తు దేశ ప్రజలు అనుబంధాన్ని కలిగి ఉన్నారు.   దీని తో ప్రపంచ ప్రజలందరూ కూడా అనుబంధాన్ని కలిగి ఉన్నారు.  ఐక్యతా మంత్రాన్ని మరింత ముందుకు నడపాలన్న ఉద్వేగం, ఆకాంక్షల తోనే ఈ ఐక్యతా యాత్ర ను నేను ప్రారంభించాను.  స్ఫూర్తి కి కేంద్ర స్థానమైన ఈ ప్రదేశం తోనే మనందరం ఐక్యతా స్ఫూర్తి ని పొందగలుగుతాం.  ఇదే భావన తో మనందరం ముందుకు నడుస్తూ అందరినీ మనతో కలసి నడిచేలా చేస్తూ ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ స్వప్నాన్ని సాకారం చేసే ప్రయత్నం సాగించాలి.  

నాతో కలిసి అనండి -

సర్దార్ పటేల్ జయ హో

సర్దార్ పటేల్ జయ హో

సర్దార్ పటేల్ జయ హో


దేశ ఐక్యత ను కొనియాడుదాం

దేశ ఐక్యత ను కొనియాడుదాం

దేశ ఐక్యత ను కొనియాడుదాం

దేశ ఐక్యత ను కొనియాడుదాం

దేశ ఐక్యత ను కొనియాడుదాం


అనేకానేక ధన్యవాదాలు.


******